"మరువం" కవితాసంకలనం పై కవిసంగమం లో వచ్చిన సమీక్ష!

సంపుటి పేరు:- "మరువం" రాసిన కవయిత్రి:-" మరువం ఉష'   
పరిచయం చేస్తున్నది :- రాజారామ్.టి

"ఆమె కవిత్వ పరిమళం నిజంగా మరువమే !"

"నిన్న వాన వెలిసి పోయిందనే బెంగ,నేడు వాన కురుస్తుందని కలత,మదికి ఇదో సరదా-ఎండ బాధ వద్దనో,చలి బారిన పడననో ఒక దాని వెంట ఒకటి యోచనా సుడులు వృథా అలజడులు"-అని ఒక జీవన శకలాన్ని చిత్రిక పట్టిన కవయిత్రి ఉష."పగలు రేయి పునరావృతాలు,ఋతువుల రాకపోకలుమారే వర్ణాలు,నడుమ చీకు చింతల నిత్య జీవిత పారాయణాలు"-కాల స్వభావంతో జీవితాన్ని ముడివెట్టిన కవయిత్రి ఉష గారు.'నీవు కేంద్ర బిందువు నన్నావు,నీ చుట్టూ ఓ అనంత వృత్తం నను గీసుక రమ్మన్నావు,ఇక్కడే నేను కొత్త పాఠం నీకు చెబుతున్నాను,వింటావా?"-అని విధాతకే పాఠం చెప్ప ప్రయత్నిస్తున్న కవయిత్రి ఉష గారు.

తనలో తానొక ప్రకృతి పరవశత్వపు పరిధి గీసుకొని,తాను పొందిఉందిన ఆ వివశత్వపు అనుభూతిని పాఠకుల హౄదిలోకి వొంపగల అభివ్యక్తి ఈ కవయిత్రిలో అగుపిస్తుంది.అపార భావుకత,అందుకు తగ్గ పద సంపద ఈవిడలో వుంది.కాల్పనిక,భావ కవితా దోరణుల మిళితం ఈమె కవిత్వం.

ఈ కవయిత్రి తన కవితా ఖండికలకు వుంచే శీర్షికలు కొన్ని ఎంతో భావుకతను అద్దుకొని పాఠకున్ని తన వైపుకు తిప్పుకొంటాయి."వలపుల వాన చినుకు","మంచు పూల పేరంటం","ఈ సిగ లెక్కెక్కడ తప్పిండొచ్చబ్బా!",-ఇలాంటి పద్యాల శీర్షికలు ఎన్నో ఉష గారి పద్యం పదునున్కు కొలమానాలుగా నిలుస్తాయి.వర్షం అందర్ని అలరించినా కొందరే దాన్ని కవిత్వం చేయగలుగుతారు.వేరు వేరు కవులు తీసుకుండే వస్తువు ఒకటే అయినా వారి మార్గాల భేదాలను బట్టి వేరు వేరు కవితలు తయారవుతాయి.వాన చినుక్కీ,నేల మంటికీ వుండే వొక చిక్కని బంధాన్ని మరువం ఉష గారు క్లిష్టత లేని పదాల ప్రయోగంతో వొక అసాధరణ వూహను నిర్మించారు."మా వూరి మబ్బుకి మమతలెక్కువనుకుంటా"-అని మొదలయ్యే ఈ కవితలో మేఘాన్ని కరి మబ్బుగా చెప్పటం సాధరణమే అయినా వెను వెంటనే "కరి వేరు మొగ్గలా మెరిసి అని అనటంలోనే వొక వైచిత్రినీ కవయిత్రి మెరిపిస్తుంది."ఉన్నది వూరుకోకుండా మెరుపు లేఖలు రువ్వే ఆ మబ్బు ఉరిమురిమి తుళ్ళిపడేలా తుంటరి పనులు చేస్తుందని"-ఉన్న రంగులు చాలక వింత వన్నెలతో వరుసలు కడుతుందని ఈ కవయిత్రి మబ్బుకి మానుష్త్వ రూప ఆరోపణ చేస్తుంది.ఇలా కవిత్వం చేయటం కృష్ణ శాస్త్రి లాంటి పూర్వ కవుల పఠనం వల్లా లాభించే విద్య అని తెలుస్తుంది.

ఈ కవయిత్రి రాసిన వాక్యాలు సాధారణంగా సాదా సీదాగా కనిపిస్తాయి కాని లోతుగా ఆలోచిస్తే ఈన్ కవయిత్రి ఒక గాఢమైన,లోతైనా భావాన్ని నిగూఢంగా వ్యక్తం చేస్తాయి."కన్నె తూరుపు వెచ్చందనాల కావిళ్ళు గడప గడపకు పంచి, పడమర కాంత కౌగిళ్ళలోకి పరుగులు తీసి సూరీడు"- అని కవయిత్రి అనే ఈ వాక్యాల్లో సూర్యోదయాన్ని,సూర్యాస్తమయాన్ని కవయిత్రి ఆవిష్కరించినట్లు అర్థం చేసుకోవచ్చు
ఈ కవిత్వ పంక్తులు సాధారణ వాక్యాల్ల అనిపిస్తాయి ఆని తూర్పు అనే కన్య వెచ్చని కావిళ్ళని వూర్లోని ప్రతివారికి అందిచ్చి పడమటి దిక్కు అనే వనిత కవ్వింత కౌగిళ్ళలోకి పరుగులతో చేరుకున్నాడు సూర్యుడు అనే వొక అద్భుత డృశ్యాన్ని కవిత్వహృదయంతో కవిహృదయం అనే ఖండికలో దృశ్యం చేస్తుంది.రేయింబవళ్ళలో రేయి వర్ణన ఎక్కువ సందర్భాల్లో కవయిత్రి చేయడం ప్రకృతిలో రాత్రి కి గల ప్రత్యేకతమో ననిఅనిపిస్తుంది.గోగణాలు ఇళ్ళకు చేరుకొనే సమయాల్ని,ఎగిరి ఎగిరి అలసిన రెక్కలతో గూటికి చేరుకొనే సాయం వేళల్నీ కవయిత్రి పేర్కొంటూ అవి అమ్మవొడికి ఆనవాళ్ళై నిత్యజీవన రేయింబవళ్ళుగా చివరికి జంటహృదయాల తుంటరి సరాగాలై పరశింప చేస్తాయని కవయిత్రి వూహనిమరింత పరిమళభరితం చేస్తుంది.

"అసంపూర్తి కల అర్థరాత్రి గాలివానలా నిదురలేపి మరీ కలవర పెడుతుంది"-అని అంటున్న ఉష గారు నిరీక్షణల్నీ తెలవారి రాలిపడిన పారిజాతాల్లా,నిట్టూర్పుల్ని దిగుడుబావి పాకుడు మెట్లలా పోలుస్తూ అర్ధాకలితో నలుగుతున్న అనాథ శిశువుని,పాల బువ్వ తెలియని పసికందైనవాన్ని"ఇరువురూ ముక్తసరి మురిపాల ఆత్మవంచకులు"-అనుభూతికి తలవొగ్గిన కారణంగా ముగ్గులేస్తున్నప్పుడూ లెక్క తప్పిన చుక్కల్లా వొక అసంబద్ద కలయికలా రూపు దిద్దుకొన్నారని ఈవిడ ఎంతో లోతైన భావాన్ని మాములు వాక్యాల్లా చెప్పి,తన నేర్పుని ప్రదర్శించింది.ఈ ప్రపంచంలో ఏ వ్యవస్త వున్నా కవులకు వస్తువు కొఱత వుండనే వుండదు అది మనుషులతోనే వుంటుంది కాబట్టి.అనాది కాలం నుంచి కవుల అనుభూతిలో అభివ్యక్తమయ్యే వస్తువు ప్రేమే.స్త్రీ పురుష సంబంధాలు వున్నంత కాలం ప్రేమకు సంబంధించిన సాహిత్యం వుండక మానదు.అభ్యుదయ,విప్లవ కవులని అనుకున్న వాళ్ళు కూడా కొండకచో ప్రేమను అద్భుతంగా చెప్పారు.అట్లాంటి కవిత్వాలు పఠితల ఆదరణను పొందాయి. ఈ కవయిత్రి కూడా కాల్పనిక,భావ కవిత్వ ధోరణిలో కవిత్వ నిర్మాణం చేయటం మూలానేమో ప్రేమను కవిత్వం చేసింది."నీవు పరచిన అంప శయ్య మీద నేను/నీ ఙ్ఞాపకాల బాణపు గాయాలతో ఎంతకూ రాని సంక్రమణానినికై/ఇన్ని యుగాల ఎదురు చూపులో"-ఇలాంటి కవిత్వపు శకలాలు "ప్రేమ సహస్ర నామాలతో" అలరిస్తాయి ఈ సంపుటిలో.

కవయిత్రి ఉష గారు సహజ ప్రియాలైనా ప్రాకృతిక అంశాలను కవిత్వంగా మార్చటమే కాదు స్త్రీ సహజ ఇష్టాలైనా ముగ్గులు,పువ్వులు,గోరింటా మున్నగు వాటిని తన ప్రతిభా పరుసవేదితో పసిడి పాదాల పరిమళ మరువపు కవిత్వం చేయటమే కాదు వాటిలో వొకానొక కూడా దుఃఖాన్ని పోస్తుంది.ముగ్గు పిండి అమ్మే స్త్రీని వెన్నెల వేకువలు తెలియని వెఱ్ఱిదానిలా,రేయింబవళ్ళు రాజుకున్న ఆకలి మంటగా నిలబెడుతుంది."నా చేతి చిత్రాలు మా ముంగిలి వైనాలు/పూల గొబ్బిళ్ళ అలరారు రంగవల్లులు/వారందరికీ తెగ మురిపాలు/మరి నీవి కాదా సగపాలు"-అంటూ ముగ్గు పిండి అమ్మిన ఆవిడకు కూడా ఆ రంగవల్లులు తెచ్చే శోభలో,ఇచ్చే ఆనందంలో సగభాగం చెందుతుందని అనటం చిత్రంగా అనిపించినా న్యాయసమ్మతమేననే భావనని కవయిత్రి కలిగిస్తుంది. భావ చిత్రాలను రూపు కట్టించటంలో ఈమెకి మంచి నేర్పు వుంది.అతి తక్కువ పదాల పేర్పుతో చాల ఆశ్చర్యాన్ని కలిగించే నైపుణ్య నిరూపణ చేస్తుంది."చేపల చెఱువు మీద నాచు/అచ్చంగా పంట పైరు పచ్చ"ఊహించుకోవాల్సిందే.
జీవితాన్వేషణ చేయటం, ఆ అన్వేషణ నుండి ప్రకృతి శక్తుల ద్వారా పాఠాలు నేర్చుకోవటం కొందరు కవులు చేస్తుంటారు.ఈ అంశం కూడా ఉష గారిలో పుష్కలంగా వుంది.ఈ లక్షణాన్ని "బహుదూరపు బాటసారి'-అనే కవితలో పొందుపరిచింది."ఈ తరుణాన వెను తిరిగి చూస్తే వేవేల క్రోసుల నా జీవిత బాట"అని మొదలయ్యే కవితలో"అచటచట బాట ప్రక్కగా నా లక్ష్యసిద్దిని నిలిపిన గిరులు/నిరాశలో కృంగిన లోయలు,వెలికి తెచ్చిన ఆశయాల నిచ్చెనలు'ఇలా సాగిన కవితలో ప్రకృతి వొక వికాస పాఠమైన వైనాన్ని కవయిత్రి విపులీకరించటమే కాదు "నా త్రోవ తుది వరకు అలుపెరుగని"అన్వేషణ స్ఫురింపచేస్తుంది. ఈ కవయిత్రి భావన శక్తి కూడా అపారమని చెప్పకుండా వుండలేనితనం సంపుటి చదివింతరువాత ఆవరించింది."గోడ మీది నీడలు"-అనే కవితలో 'దృశ్యానికీ,అదృశ్యానికీనడుమ విన్యాసం.../సర్పంలా సాగిన నీడ/గోడ మూలలో పడగ విప్పింది/చీకటికీ దీపానికి మధ్య సమరం/ నీడ రూపు మార్చింది/నేల బారున తాబేలు ఈ మారు/మోడో అడుగుకీ కృంగి/దేహపు అరలోకీ మటు మాయం"-ఈ మాటల్లో దృశ్యానికీ,అదృశ్యానికీ మధ్య గల తేడాను నీడల్నీ సారూప్యం చేసి వొక అసాధరణ వూహను నిర్మించింది ఈవిడ.
కాలాన్ని తవ్వితే కలల ఇందనం వూరుతుందనికలలు రావటం వల్లనే రాత్రులు కరగిపోతున్నాయని కలని కొనటానికి నిద్రని ఖర్చు చేయాలనే వూహించని భావ ప్రవాహాల్నీ మన ముందు ప్రవహింప చేస్తుంది.
కలం నింపిన కల్లం-అనే ఖండికలో చెలిమిని మానవ జీవిత మాగాణిలోని పైరు పంటలతో ఉపమిస్తూ పల్లె సౌభాగ్య చిత్రాన్ని గీసి "సారం తరగని మాగాణి సంక్రాంతి మన చెలిమి"-అని అంటుంది ఈమే."దృశ్యం కరిగేలోపు ఙ్ఞాపకాల సంకెల్లతో బిగించి కట్టి పడేసేది కన్ను'.ఆ కన్ను ను కవిత్వం చేసిన ఖండిక అనుభూతి వులితో చెక్కిన నిర్మాణ శిల్పంతో మనల్ని కట్టి పడేస్తుంది."నేల చీకాకు పడేంత వాన"-అనే ఒక్క పాదమే వర్ష భీభత్స దృశ్యాన్ని చిత్రిక పడుతుంది.మనుషుల మధ్య మమతలన్ని ఇగిరిపోతున్న సందర్భాన్ని "గోడ గుండె పగిలింది "-అనే కవితలో నిరూపిస్తుంది.

ఆవిడ రాసిన"అరచేతి గీత నిలువున చీల్చితే/నుదుటి రాత మారుననే పేరాశ"-లాంటి వాక్యాలు సమాజ మూఢనమ్మకాల్ని చీలుస్తాయి.ఆకాశంలోని వాతావరణాన్ని ఎంత సౌందర్యంగా వర్ణిస్తుందో చూడండి."మంచుపూలపేరంటం"-అనే కవితలో.కిందున్న నేల రాణికేనా ఇన్ని సంబరాలు అని ఆకాశరాజు ఈర్ష్య పడ్డాడని చెబుతూ" మబ్బు ముగ్గులేసి/మంచు పూలు చల్లి/చుక్కల గొబ్బిళ్లు పెట్టి'-సంక్రాంతి పర్వ వాతావరణాన్ని ఏర్పరుస్తుంది."గంప అక్కడుంటే గుప్పేడేనా నాకు మల్లె మొగ్గలు"-అని ఆరంభమయ్యే కవిత"ఈ సిగ లెక్కెక్కడ తప్పుతుందబ్బా"-అనే కవితలో గడిచిపోయిన పోల్చుకొంటూ తన జడ తో పెనవేసుకొన్నా ఆత్మీయబంధాన్ని నెమరు వేసుకొంటూ,"దాని జడ జానెడు/నాది బారెడు"అంటూ తన జడ నిండు గోదారేనని ఉపమించుకొంటూ,విరజాజి కుదురు కూడా తన జడ ముందు తలవంచక తప్పదని కవయిత్రి వొక పురా స్మృతి లోకి తీసికెళుతుంది.జడ స్త్రీ సహజ సౌందర్య వస్తువే అయినా ఈ కవితలో ఉషగారు అంత అందంగా చెప్పి తన ప్రత్యెకతను చాటుకొన్నారు.

పిచ్చుక పైన రాసిన కవిత వొక అద్భుత కవిత ఖండిక.అరుణగారు పిచ్చుకను :పిట్టా నువ్వు ఈ లోకంలో పట్టవు"అని అంటే మరువం ఉష 'మళ్ళి ఇంత కాలానికీ ఈచలి దేశంలో ఆకురాలు కాలంలో భలేగా కనిపించావే"-అని మురిసిపోతుంది."నువ్వొక్కతివే వచ్చావేమోనని పలకరిస్తే"అని పిచ్చుకతో చేసే సంభాషణ పఠితల హృదిలోకి గుచ్చుకొని ఙ్ఞాపకాల సలపరం రేపుతుంది.

ఈ 'మరువం'-సంపుటిలో కొన్ని కవితలు హృది తడిపేవి కాకపోయిన "తూర్పార బోసిన గింజలు" కొన్ని చదువరులకు గొప్ప అనుభూతిని మిగిలిస్తాయి. వలపు వాన చినుకును మంచు పూల పేరటం కు పిలిచి గాలి లేఖ రాసి రమ్మని,జీవితం సౌందర్య రాహిత్యం కాదని చెబుతూ ఈ జాడలు తన కవితలో వున్నాయంటున్న కవయిత్రి ఉష గారు. ఒడి ఇచ్చిన అమ్మ వెళ్ళిపోయినా,బొడ్డు కోసిన బాపనమ్మ అటే మళ్ళినా,అడుగులకు చేయూత నిచ్చినతాతయ్య,బువ్వ పెట్టిన అమ్మమ్మ..ఇలా అందరు వెళ్ళిపోయారని తన ఙ్ఞాపకాలని మన ఙ్ఞాపకాలుగా మార్చింది.అంటే తన అనుభూతుల్ని పాఠకుల అనుభూతులుగా చేయ గలిగిందంటే ఆమె మంచి కవయిత్రి అని నేను అనటం.అందుకు ఆమెను అభినంద్స్తున్నా.ఈమె కవిత్వాన్ని కపిల రామ్ కుమార్ గారు మరువం దవనం అని వ్యాఖ్యానిస్తే ఆవిడ మరువం,దవనం వాసనలు ఒకచోట పొసగవనే ఉద్దేశ్యంతోనేమో మరువం ఒక్కటే చాలు అన్నట్లు ఙ్ఞాపకం.ఈవిడను కోరుతున్నా మరువం తో పాటి దవనం కూడా కవిత్వం చేసీ కవిత్వ కాంత జడలో వొక అలంకారం చేయమని.

No comments:

Post a Comment