సృష్టి విలాసంలో శింబి

రథసప్తమి సందర్భంగా చిక్కుడుతీగెలు, కాయలు జ్ఞప్తికి వచ్చాయి..అలా అలా ఈ చిరు వ్యాసం ఉనికి సంతరించుకుంది.

"చిక్కుడు గింజకు తన పాదు ఎక్కడో తనకే తెలియదు" అని సామెత గా చెప్పుకున్నా, బహుశా చిక్కుడుపాదుకీ తన సృష్టి ఉద్దేశ్యము తెలియదేమో!? ఇలానే పలు దర్శనాల్లో మునిగితేలిన వారి వివరణ ఇలా ఉంది-

ఒక చిక్కుడుతీగను సృష్టించేటప్పుడు భగవంతుడు తన శాకంబరి తత్వముగా వ్రేళ్ళు కాండము పత్రములు గా విభజించి, ఆ భాగాలకి ఒక్కో స్వభావము- అంటే వేర్లలో నీరు, ఆహారాల గ్రహణశక్తి, కాండ భాగముల ద్వారా ప్రసరణశక్తి, పత్రభాగముల ద్వారా ప్రాకృతిక శక్తుల గ్రహణశక్తి- నిచ్చి తద్వారా ఎన్నో శక్తులనిచ్చి తదనంతరము నిక్షేపించిన శక్తులను ఆహార పదార్ధములుగా తయారుచేయడమే, ఆ సృజన కి మూలమట.

"శింబి" అంటే చిక్కుడుతీగ. ఋతులక్షణ వశమున నశించే చిరు ప్రాణి కానీ ఉన్నంతకాలం 'కార్తీకమాసంలో కదురంత వున్నాను, మాఘమాసంలో నా మహిమ చూపుతాను' అంటూ చిక్కుడుకాయలు, గింజలు చేసి ఇచ్చిపోతుంది కదా!

కనుకా

"జగము సృజించినదెవడో వాడే
జనులను సృజియించే
ఆకలినిచ్చినదెవడో వాడే అన్నము సృజియించే..."

కానీ

"కనులకు దోచి చేతికందని ఎండమావులున్నై
సోయగముండి సుఖము నోచని బ్రతుకులున్నవి కొన్ని
భూమి జనించి ఆకలికొదగని ఫలములున్నవి కొన్ని
మనసున నిండి పలుకగరాని తలపులున్నవీ కొన్ని"

మరి

"సృష్టిచేసినది దేవుడైన మరి నాశమునేల సృజించే
పలుకునొసగినది దేవుడైన మరి మూగలనేల సృజించే
కనులనొసగినది దేవుడైన మరి అంధులనేల సుజించే
వెలుగునిచ్చినది దేవుడైన మరి చీకటినేల సృజించే"

మనిషి కి కూడా మనసు, బుద్ధి, వివేచన లక్షణాలు ఇచ్చి, ఆంతరంగ ప్రేరేపణలూ కల్పించి, వాటి వశమున సృష్టి పరమార్థమును సాధించుటకు నిరంతరకృషి జరుపుతూనే వున్నాడు. కలడా? లేడా? అనిగాక ఒక చిన్న తీగెలో కనిపించిన సృష్టి తత్త్వాన్ని జీర్ణించుకుని,

"బ్రతుకంతా పలు ప్రశ్నలమయమై బ్రతుకును జనసముదాయం"

కూడా జీర్ణించుకుని, "బదులు కోసమై వెదకుట మాని బ్రతుకుటయే న్యాయం!" అన్న ఒక్క సూత్రాన్ని పాటిస్తే చాలు! నిజంగానే మాఘ మాసం లో తన మహిమ చూపింది ఈ చిరు తీగె.

(గమనిక: ఇందులో ప్రస్తావించిన సామెత, వివరణ, గీతం వంటివి వివిధ వనరుల నుంచి తీసుకున్నాను. కనుక, నా దర్శనమని మీకేది అనిపించిందో దాన్నుంచి మీరు/చదువరులు స్వీకరించతగినది యేదేని ఉంటే తీసుకొనండి.)

07/02/2014

No comments:

Post a Comment