శీతకారు గమనాన

ఓరుగాలి, జడివాన జతపడిన విలయ తాండవం:
కోటానుకోట్ల పత్రాలు ఏరులై, ఏటి నడుమ మేటలై
చీకటి దాగలేని తోపుల్లో,  పిట్టలు విడిచిన మోడుల్లో
అనేకానేక కిరణశలాకలు ఆకులై, ఆకులపొదిలో పూలగుత్తులై
దుఃఖపాటు ఘడియలు ఉన్నపళంగా వచ్చిపడ్డట్టు, 
ఓదార్చే హృదయాలు చరాలున  చేరువైనట్లు 
ప్రకృతి ఉగ్గబట్టిన ఊసుకి వార్థక్యము యుగాంతం వరకు రాదు. 

సాచిన కొమ్మలతో వారిస్తూ "ఉన్నదొక్కటే వసంతానికి ప్రతీక్ష" ఎవరి స్వరమో!?

నేలపొరలో వత్తిగిల్లుతూ విత్తనమొకటి "అంకురమై వస్తా,"నన్నట్లే   

మేల్కొలుపు లోలోపల ఊహలకి, ఊహకందని ఊర్పులకి.

లెక్కకందని భాష్పధారలు ఏరులై, ఏటి నడుమ గుండాలై
తడారని కనులు, తడారిన ధమనులు తెరిపిన పడతాయి
చిగురు తొడిగిన మనిషి పచ్చని వృక్షమై నీడనిస్తే
మొలకల మేనిలో రంగుపూల ఉనికి పెల్లుబుకుతుంది
చిట్టచివరికి జీవనం- గమ్యం చేరిన గమనం- ప్రకృతిపరం
వరమూ అవుతుంది, వేళ్ళూనిన నమ్మికతో విశ్వాత్మ ని దర్శిస్తే.

(తానా పత్రిక నవంబర్ 2015 సంచిక లో ప్రచురితం)

http://patrika.tana.org/november2015/#p=38

1 comment:

  1. (తానా పత్రిక నవంబర్ 2015 సంచిక లో ప్రచురితం)
    http://patrika.tana.org/november2015/#p=38

    ReplyDelete